పశ్చిమాసియా రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఆ దేశాన్ని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. యూఏఈ పాలకుడు షేక్ ఖలిఫా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు ప్రారంభం కానున్నాయి.
దాదాపు సంవత్సరం నుంచి అమెరికా చొరవతో ఇజ్రాయెల్-యూఏఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. వెస్ట్బ్యాంకులో పాలస్తీనా భూభాగాలను కలుపుకునే ప్రణాళికను ఆపేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడం వల్ల ఈ నెల 13న ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు చారిత్రక ఒప్పందం కుదిరింది. అందుకు అనుగుణంగానే ఇజ్రాయెల్ బహిష్కరణను ముగిస్తూ శనివారం షేక్ ఖలీఫా డిక్రీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఇజ్రాయెల్ సంస్థలు.. యూఏఈ సంస్థలతో, వ్యక్తులతో లావాదేవీలు జరపవచ్చు.
విమాన ప్రయాణం...
రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు కూడా ప్రారంభంకానున్నాయి. సోమవారం టెల్ అవీవ్ నుంచి అబుదాబికి నేరుగా విమానం నడవనుంది. ఇందులో ఇజ్రాయెల్ అధికారులతో పాటు.. అమెరికా అధికారులు, ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా పయనించనున్నారు.
జోర్డాన్, ఈజిప్ట్ తర్వాత ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకున్న మూడో అరబ్ దేశం యూఏఈ కావడం గమనార్హం.
ఇదీ చూడండి:- ఇజ్రాయెల్-యూఏఈ డీల్తో ఎవరికి లాభం?